మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపించారు చెన్నైకు చెందిన డాక్టర్లు, ఓ స్వచ్ఛంద సంస్థ. వారి గొప్ప మనసు ఓ యువతి ప్రాాణాలను నిలబెట్టింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న కరాచీ యువతికి.. ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సను నిర్వహించి మంచి మనసును చాటుకున్నారు. ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చి.. భారత్ అంటే మానవత్వానికి మరో రూపం అని చాటి చెప్పారు.
ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో విజయవంతంగా అవయవమార్పిడి చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రితో పాటు ట్రస్టు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాతృత్వాన్ని చాటుకున్నారు. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల యువతి ఆయేషా రషన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని డాక్టర్లు గుర్తించారు. గుండెమార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువకాలం బతకదంటూ తెలిపారు.
ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.35 లక్షలకు పైగా ఖర్చువుతుందని, భారత్కు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రషన్ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చైన్నైకు చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ.. భారత్లో సర్జరీకి ఏర్పాట్లు చేసింది. చెన్నైలోని ఎమ్జీఎమ్ హెల్త్ కేర్ ఆస్పత్రిలో నిపుణుల బృందం ఆ యువతికి.. అవయవదానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించి, మానవత్వానికి ఎల్లలు లేవని నిరూపించారు.
ప్రస్తుతం రషన్ పరిస్థితి నిలకడగా ఉంది. మీడియాతో మాట్లాడిన ఆమె.. గుండె మార్పిడి తర్వాత తనకు చాలా బాగుందని అన్నారు. తన కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్టు, వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. రషన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పాకిస్థాన్కు వెళ్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: టి20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉసేన్ బోల్ట్