Saturday, May 4, 2024

హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు

spot_img

హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైల్వే లైను వంపుల్లో పరిమితికి మించి వస్తున్న శబ్ద కాలుష్యంపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

సికింద్రాబాద్‌ సమీపంలోని బోయిగూడ మెట్రో పిల్లర్‌ B1006 దగ్గర రైల్వే ట్రాక్‌ వంపు దగ్గర మితిమీరిన శబ్దం వస్తోదని.. శబ్ద నియంత్రణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్‌ హనుమాన్లు అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. పరిమితికి మించి వస్తున్న రైలు శబ్దం అసౌకర్యంగా ఉందని.. వినికిడి సమస్యలతో పాటు బీపీ, గుండెపోటు వంటి జబ్బులకు అవకాశం ఉందని లేఖలో తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, పొల్యూషన్ కంట్రోల్ నిబంధనల ప్రకారం అధిక శబ్దం హార్మోన్ల సమతౌల్యతను దెబ్బతీస్తుందని హనుమాన్లు లేఖలో పేర్కొన్నారు. మెట్రో రైల్వే బృందం ఇటీవల బోయిగూడ, జూబ్లీహిల్స్‌ బస్‌స్టేషన్‌, ఎంజీ బస్‌స్టేషన్‌ల వద్ద మెట్రో రైలు వెళుతున్నపుడు శబ్దాన్ని రికార్డు చేసిందన్నారు. ఎంఎన్‌కె విఠల్‌ అపార్ట్ మెంట్‌ దగ్గర ట్రైన్ వెళుతున్నపుడు ధ్వని తీవ్రత 80 డెసిబుల్స్‌ ఉందని చెప్పారు. మెట్రో నగరాలైన బెంగళూరు, నోయిడా,ముంబై, చెన్నై, నాగ్‌పుర్‌, కోల్‌కతాల్లో సౌండ్ పొల్యూషన్ నిరోధించేలా సోలార్ ఎలక్ట్రిక్ ప్లేట్స్ ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు చేసి ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు విద్యుదుత్పత్తి చేపట్టాలన్నారు.

హనుమాన్లు రాసిన ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, తెలంగాణ డీజీపీ, నగర పోలీసు కమిషనరు, మెట్రో రైలు ఎండీ, మెట్రోరైల్‌ డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: నటి తమన్నాకు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులు..!

Latest News

More Articles