Saturday, May 4, 2024

450 కోట్ల స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం: రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తం

spot_img

హైదరాబాద్‌: నగర ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. రూ.450 కోట్లతో ఇందిరాపార్క్‌-వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎంపీ కే.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే ముఠ గోపాల్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే నగరం వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు.

కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లై ఓవరని చెప్పారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టుకున్నామని, అదేవిధంగా స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు.

2001 నుంచి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నిలిచారని, దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా, రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేశారన్నారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని పేర్కొన్నారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామన్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు 2023లో సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Latest News

More Articles