ఆయనకు చిన్నప్పటి నుంచే చదువంటే మక్కువ. ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడు. కానీ, కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టెన్త్ లోపే చదువు ఆపేయాల్సి వచ్చింది. అయినా చదువుపై తన ఇష్టాన్ని మాత్రం చంపుకోలేదు. కుటుంబ బరువు, బాధ్యతలు అన్నీ పూర్తయిన తర్వాత పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసి.. తాజాగా డిగ్రీలో కూడా చేరాడు. హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన చిన్నా ఎరుకుల ఏపీ ట్రాన్స్కోలో లైన్మన్గా పనిచేసి 2007లో పదవీ విరమణ పొందారు. అనంతరం తన చదువును కొనసాగించాలని అనుకొని, బీటెక్ చదవాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
Read Also: 100 ఓట్లకో ఇంచార్జీ.. గ్రామానికో మ్యానిఫెస్టో పెట్టండి
తొలుత ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి పూర్తిచేశారు. 2021లో ఇంటర్ వొకేషనల్ కోర్సులో చేరి ఇంటర్మీడియట్ను పూర్తిచేశారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా సెకండియర్లో లాటరల్ ఎంట్రీ ద్వారా చేరినా కొన్ని పేపర్లు బ్యాక్లాగ్లో ఉండటంతో డిప్లొమా పొందలేకపోయారు. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాలనుకున్నా అధిక ఫీజులు భరించలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆయనకు వయస్సు అడ్డంకిగా మారింది. చిన్నా 1948లో జన్మించగా, దోస్త్ వెబ్సైట్లో 1973లోపు జన్మించిన వారికే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. దీనిని సవరించాలని కోరుతూ ఆయన ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ అధికారులను సంప్రదించారు. ఆధార్కార్డులో సాంకేతిక కారణాలు సైతం అడ్డంకిగా నిలిచాయి. ఆయన ఆశయం, పోరాటం ముందు అన్ని తలవంచాయి. ఎట్టకేలకు నాలుగేండ్ల బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ (ఆనర్స్) కోర్సులో ప్రవేశం పొందిన చిన్నా.. 74 ఏండ్ల వయసులో చలో అంటూ కాలేజీకి వెళ్తున్నారు.