ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు ఫిర్యాదు చేశారు. నాగసుశీల, శ్రీనివాస్ కలిసి గతంలో పలు మూవీలను నిర్మించడంతో పాటు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు.
అయితే..శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నట్టు సమాచారం. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను అమ్మాడని గతంలో పంజాగుట్ట పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు.
మరోవైపు తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.