గజ్వేల్ : ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతోందని, మేం గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్కౌంటర్లు, రక్తపాతం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో 1969లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్లీ కోరుతున్నారా? అని నిలదీశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: అన్నీ తానై.. అటు ప్రచారపర్వం, ఇటు పార్టీ వ్యూహరచన.. కేటీఆర్ అలుపెరగని ప్రచారం
ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇది ఎట్ల ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగాలని అన్నడట యెన్కటికి ఒకడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా తట్టుకోని, నిలబడి, మొండిగా, చివరకి మళ్లీ ధోకా చేశారని గుర్తించి, ఇక తప్పదనే నమ్మకానికి వచ్చి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే, 33 పార్టీలు మనకు అండగా వస్తే అప్పుడు దిగొచ్చి తెలంగాణను ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు.