Tuesday, May 7, 2024

పండగపూట తాగిన మత్తులో వాచ్‎మెన్‎ను హత్యచేసిన తాపీ మేస్త్రీ

spot_img

పండగపూట తాగిన మత్తులో వాచ్‎మెన్‎ను హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. నార్సింగీ పరిధిలోని మంచిరేవులలో జంగయ్య అనే వ్యక్తి.. కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గర వాచ్‎మెన్‎గా పనిచేస్తున్నాడు. అయితే జంగయ్య గత కొన్ని రోజుల నుంచి యజమానికి తెలియకుండా స్క్రాప్ అమ్ముకుంటున్నాడు. ఇది గమనించిన తాపీమేస్త్రీ అర్జున్.. జంగయ్యను హెచ్చరించాడు. అయినా కూడా జంగయ్యలో మార్పు రాలేదు. దాంతో అర్జున్ ఈ విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో వాచ్‎మెన్ జంగయ్యకు యజమాని ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో నిన్న సంక్రాంతి పండుగ కావడంతో వాచ్ మెన్ జంగయ్య, మేస్త్రీ అర్జున్ ఇద్దరూ కలిసి బాగా తాగారు. మాటల మధ్యలో నా మీదే యజమానికి చెబుతావా అంటూ జంగయ్య గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో మద్యం మత్తులో ఉన్న అర్జున్.. పదునైన ఆయుధంతో జంగయ్య తలపై బాదాడు. దాంతో జంగయ్య తలకు తీవ్ర గాయమై స్పాట్‎లోనే మృతిచెందాడు. అది చూసి భయపడిన అర్జున్ అక్కడి నుండి పరారయ్యాడు. గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Read also: వస్త్ర పరిశ్రమపై కాంగ్రెస్‎కు కేటీఆర్ కీలక సూచన

Latest News

More Articles