Thursday, May 9, 2024

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

spot_img

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలపై తీసుకోవలసిన చర్యల మీద వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలి విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ.. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు రాచకొండ పోలిస్ కమిషనరేట్ తరపున పూర్తీ సహకారం అందిస్తామని కమిషనర్ తెలిపారు. నకిలీ విత్తనాలను అమ్మేవారిపైన పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు నకిలీ విత్తనాల అమ్మకం మరియు సరఫరాకు సంబంధించి రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఐదేళ్ళలో 14 మంది మీద పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రజలు కూడా నకిలీ విత్తనాలు పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం మరియు లోగో హోలోగ్రాం వంటి వాటిని బాగా పరిశీలించి మాత్రమే కొనాలని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు.

నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామని, వారు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం, అడ్డుకోవడం, కట్టడి చేయడం, వారు ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు, ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టీలైజర్ షాపులపైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాపులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇంకా మరేమైనా విత్తనాలు కానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వస్తే, వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నకిలీ విత్తనాల పట్ల ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు.

Latest News

More Articles