హైదరాబాద్: ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లను అలెర్ట్ చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, మానిటర్ చేయాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు.
వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.