ఐఎస్బి మొహాలీలో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఈ కోర్సులో చేరిన వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్రభుత్వాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసులో పనిచేస్తున్న పలువురు మంత్రి కేటీఆర్తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆయన చేసిన ప్రసంగంతో పాటు ఆయన అనుభవాల పట్ల మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ యంత్రాంగంలో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్న తమకు ఇలాంటి నాయకులతో సంభాషించే అవకాశం అరుదుగా లభిస్తుందన్నారు. మంత్రి ప్రసంగం తర్వాత పలువురు ISB ప్రొఫెసర్లు వ్యక్తిగతంగా అనేక అంశాలపైన విపులంగా చర్చించారు. వివిధ రాష్ట్రాలలో వివిధ రంగాలకు చెందిన ఐఎస్బి విద్యార్థులు మంత్రి కేటీఆర్తో ప్రత్యేకంగా ఫోటోలు కూడా తీసుకున్నారు. ఐఎస్బి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లీడర్షిప్ ప్రోగ్రామ్కు సంబంధించిన విద్యార్థులతోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సమాజంలో నాయకత్వ లక్షణాలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అత్యంత కీలకమని, అప్పుడే దేశం మరింత వేగంగా పురోగమిస్తోంది అన్నారు. మంత్రి తెలంగాణ విజయాల గురించి ముఖ్యంగా హైదరాబాద్ ప్రగతి ప్రస్థానం గురించి ప్రసంగించిన సందర్భంగా ఐఎస్బిలోని సమావేశ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.