Thursday, May 2, 2024

సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 700 కోట్ల బోన‌స్

spot_img

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 700 కోట్ల బోన‌స్ ఇస్తామ‌ని ప్ర‌కటించారు.  మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు.

సింగ‌రేణి 134 ఏండ్ల చ‌రిత్ర ఉంది. వాస్త‌వానికి అది మ‌న‌కు సొంత ఆస్తి. నిజాం కాలంలో ప్రారంభ‌మైన సింగరేణి.. వేలాది మందికి అన్నం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో సింగ‌రేణిని స‌ర్వ‌నాశ‌నం చేశారు. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చి .. వాటిని తిరిగి చెల్లించ‌క‌, కేంద్రానికి 49 శాతం వాటా కింద అమ్మేసింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం.

తెలంగాణ వచ్చిన 2014 కంటే ముందు కార్మికుల‌కు ఇచ్చే బోన‌స్ 18 శాతం మాత్ర‌మే. అంటే కేవ‌లం రూ. 50 నుంచి 60 కోట్లు మాత్ర‌మే కార్మికుల‌కు పంచేది. తెలంగాణ వ‌చ్చాక సింగ‌రేణి న‌డ‌క మారింది. 2014లో సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్ రూ. 11 వేల కోట్లు మాత్ర‌మే. ఇవాళ అదే సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్‌ను రూ. 33 వేల కోట్ల‌కు పెంచుకున్నాం. అదే విధంగా సింగ‌రేణి లాభాలు కేవ‌లం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మాత్ర‌మే ఉండే. ఇవాళ సింగ‌రేణిలో ఈ ఏడాది వ‌చ్చిన లాభాలు రూ. 2,184 కోట్లు.

వ‌చ్చే ద‌స‌రాకు రూ. 700 కోట్లు సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్ కింద పంచబోతున్నం. సింగ‌రేణిలో నూత‌న నియామ‌కాలు చేసుకుంటున్నాం. 10 సంవ‌త్స‌రాల కాంగ్రెస్ పాలనలో 6453 ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హ‌క్కును పునుద‌ర్ధ‌రించి 19,463 ఉద్యోగాల‌ను క‌ల్పించాం. 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు క‌ల్పించాం.

సింగ‌రేణిలో ప్ర‌మాదం జ‌రిగి కార్మికులు చ‌నిపోతే గ‌తంలో పాలించిన ప్ర‌భుత్వాలు రూ. ల‌క్ష ఇచ్చి చేతులు దులుపుకునేవి. కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వచ్చాక రూ. 10 ల‌క్ష‌లు ఇస్తుంది. అదే విధంగా వ‌డ్డీ లేకుండా రూ. 10 ల‌క్ష‌ల రుణం ఇంటి కోసం ఇస్తున్నాం.’’ అని కేసీఆర్ తెలిపారు.

Latest News

More Articles