వరంగల్ జిల్లా: అధికారంలో ఉన్నా, లేకున్నా.. తెలంగాణ ప్రజల దళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్ఎస్సే అని ఇదే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళదామని బీఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపి పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాములో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం పోటీపడిన విధంగానే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పోటీపడాలన్నారు. రైతుబంధు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కోసం ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులని సమీక్షించుకొని తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అభివృద్ధిని స్వాగతిస్తామని, లేకుంటే ప్రజా సమస్యల పైన నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు.
పదేళ్లలోనే 50 ఏండ్ల అభివృద్ధిని కండ్లచూపిన ఘనత మన బీఆర్ఎస్ సర్కార్ది. తన విజన్తో జనం గుండెల్లో నిలిచిన నేత కేసీఆర్. దురదృష్టశాత్తూ మన ప్రభుత్వం ఏర్పడలేదు. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీ జెండాను ఎగరేద్దాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటా. జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.
Also Read.. నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో