కర్ణాటకలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడువకముందే కన్నడ నేలను అంధకారంలోకి నెట్టేసిన కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతున్నారు. కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేసి రోడ్లెక్కుతున్నారు. రైతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో.. మాకు కరెంటు ఇస్తారా? లేదా? అంటూ ఓ సబ్స్టేషన్లో మొసలిని వదిలేశారు.
దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇలా కాంగ్రెస్ను నమ్మి అధికారం అప్పగించి నట్టేట మునిగామని గ్రహించిన కర్ణాటక రైతన్నలు.. హస్తం పార్టీని నమ్మి మరెవరూ మోసపోవద్దని ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ను నమ్మి తమలా మరెవరూ మోసపోవద్దని త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో గద్వాలకు వచ్చి ప్రచారం నిర్వహించారు. కరెంటు లేక మా పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ చేతిలో మేం మోసపోయాం.. మీరు మోసపోకండి అని తెలంగాణ రైతన్నలు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. pic.twitter.com/19opoOSNMp
— Namasthe Telangana (@ntdailyonline) October 24, 2023