రామనవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ(బుధవారం) ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో రామ నవమి వేడుకలకు దౌర్జన్య సంఘటనల కారణంగా అంతరాయం కలిగింది. బీజేపీ,టీఎంసీ మధ్య పెద్ద ఎత్తున సంఘర్షణకు అది దారి తీసింది.
మమతా బెనర్జీ ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘వారు అల్లర్లకు పాల్పడతారు. దౌర్జన్య సంఘటనలకు అవకాశం ఉన్నది. అల్లర్లు, వోట్ల లూటీ ద్వారా వారు ఎన్నికల్లో గెలుస్తారు’ అని ఆరోపించారు. అంతకు ముందు టీఎంసీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేడుకల సమయంలో ‘శాంతిని పరిరక్షించవలసిందిగా’ విజ్ఞప్తి చేశారు. బీజేపీ దీనిని ఖండించింది. పశ్చిమ బెంగాల్ సీఎం భారతీయ, సనాతన సంస్కృతిని కించపరుస్తున్నారని బీజేపీ ఆక్షేపించింది.
‘శాంతి పరిరక్షణకు విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది రామ నవమి ఉత్సవాన్ని కించపరచడమే. మతపరమైన ఇతర సందర్భాల్లో మీరు శాంతి సందేశం ఇచ్చారు. కాని ఇక్కడ మీరు శాంతి. సౌభాగ్యాల సందేశంఇవ్వడానికి బదులు‘శాంతి పరిరక్షణ’ను కోరుతున్నారు. అలా చేయడం ద్వారా మీరు భారతీయ, సనాతన సంస్కృతిని కించపరచజూస్తున్నారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. ఇది ఇలా ఉండగా, టీఎంసీ, బీజేపీ రెండూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా రామనవమి ఊరేగింపులు నిర్వహించాయి.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రేపే నోటిఫికేషన్