Sunday, May 5, 2024

రైతుబంధు ఆపిన కాంగ్రెస్‏ను ఖతం చేయాలి

spot_img

రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. రైతుబంధు విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు దురదృష్టకరం అన్నారు. ఆనాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే.. నేడు ఎన్నికల కమిషన్ రూపంలో ఆటంకం కలిగిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే అని మంత్రి అన్నారు. రైతుబంధు విషయంలో రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదన్నారు. తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు అన్నారు. ఎన్నికల తరువాత యధావిధిగా రైతుబంధు విడుదలవుతుందన్నారు. మళ్ళీ కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా.. రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతుబీమాతో పాటు ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేరన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. సూర్యాపేట జిల్లాలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న మంత్రి, ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. గ్రామాలకు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంగా ప్రజలు తమను అభ్యర్థులుగా గుర్తించకుండా.. వినతులు, విజ్ఞాపనలతో ఇస్తూ తమను ఇంకా మంత్రులుగానే భావించి అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు.

Latest News

More Articles