యాదాద్రి భువనగిరి: కేసీఆర్ మాటిచ్చిండు అంటే.. తప్పుడు ఉండదు.. 19 వేల కోట్లతో రెండోసారి రైతు రుణమాఫీ చేస్తున్నాము. చేనేత రుణమాఫీ కూడా ఇది వరకు చేశాం. మళ్లీ చేనేత రుణాల మాఫీ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘‘హ్యాండ్లూమ్, పవర్ లూమ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. టెస్కోను బలోపేతం చేస్తున్నాం. సొసైటీకి ఎన్నికలు కావాలంటే వెంటనే పెడుతాం. మాకేం అభ్యంతరం లేదు. కార్మికులు బాగుపడాలనేది మా ఆలోచన. మనసున్న నాయకుడు మంచి సీఎం ఉంటే అన్ని పనులు అవుతాయి.
రైతు రుణమాఫీ అవుతదా అని అనుకున్నారు. కరోనా వల్ల ఆర్థికంగా కొంత నష్టపోయినం. అయినా రుణమాఫీ చేయడని కాంగ్రెసోళ్లు అనుకున్నారు. కేసీఆర్ మాటిచ్చిండు అంటే.. తప్పుడు అంటూ ఉండదు. 19 వేల కోట్లతో రెండోసారి రైతు రుణమాఫీ చేస్తున్నాము. ’’ అని కేటీఆర్ తెలిపారు.