యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అందులో అనుమానమే లేదు. కేసీఆర్ మూడోసారి ముచ్చటగా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చేనేతపై జీఎస్టీ విధించిన మోదీని ఓడించాలి. కేంద్రంలో కూడా మనం ఉండాలి. కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడతది. మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు. కేంద్రంతోని కొట్లాడే వాళ్లు కావాలి. కేంద్రం మెడలు వంచే నాయకుడు కావాలి. కేసీఆర్ లాంటి నాయకుడు ఇక్కడ ఎవర్ని నిలబెట్టినా గెలిపించాలి. కేసీఆర్ లాంటి దమ్మున్న దక్షత కలిగిన నాయకుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే పరిస్థితి రావాలి.
రాష్ట్రంలో నేతన్నల కోసం అనేక పథకాలను తీసుకొస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు, హౌసింగ్ కమ్ వర్క్ షెడ్డు కార్యక్రమాన్ని రద్దు చేసింది. 75 ఏండ్లలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని తప్పు ఈ ప్రధాని చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గమైన ప్రధాని మోదీ. జీఎస్టీ ఎత్తేయాలని సీఎం కేసీఆర్ కూడా చండూరు వేదికగా మోదీకి అభ్యర్థించారు. ’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.