మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు తేలింది.
అయితే, ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని వైద్యాధికారులు తెలిపారు. బాధితుడు జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో సహా పలు లక్షణాలతో బాధపడ్డాడని, ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడని తెలిపారు.
జికా వైరస్ను తొలిసారిగా 1947లో ఉగాండాలోని జికా ఫారెస్ట్లో గుర్తించారు. 2015లో అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా, నైరుతి ఆసియా, పెసిఫిక్ ద్వీపాల్లో జికా వైరస్ కలకలం సృష్టించింది.
భారత్లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ సాధారణంగా ఏడిస్ దోమల కారణంగా సోకుతుంది. ప్రస్తుతం జికా వైరస్కు నిర్ధిష్టంగా ఏ చికిత్స లేదు.