యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ భువనగిరి గర్ల్స్ హైస్కూల్లో భవ్య, వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు పదో తరగతి చదువుతున్నారు. కాగా.. వీరిద్దరూ శనివారం రాత్రి హాస్టల్లోని ఒకే గదిలో ఉరి వేసుకొని చనిపోయారు. అర్థరాత్రి గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి సమాచారమివ్వడంతో హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబసభ్యులకు సమాచారమివ్వడంతో అక్కడకు చేరుకొని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.