Thursday, May 9, 2024

మిషన్ భగీరథ తాగునీరు మినరల్ వాటర్ కన్నా గొప్పది

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: 100 శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం, 80% రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈనెల 2 నుంచి 22 వరకువి వివిధ కార్యక్రమాలను  నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ గ్రామీణ మండలం మన్యంకొండలో మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన “మంచినీళ్ల పండగ “కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో తాగునీటి కోసం మహిళ కిలోమీటర్ల దూరం నడిచి బిందె మీద బిందె పెట్టుకుని తెచ్చుకున్న పరిస్థితులు ఉండేవని ,అప్పుడు నీటిని ఏ విధంగా నీటిని వినియోగించుకున్నామో ఇప్పుడు అదే విధంగా వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి గుర్తుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటున్నామని, ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చిఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రవేశపెట్టారని, ఇది ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశం యావత్తు ప్రశంసిస్తున్న పథకం అని అన్నారు.

అన్ని నీటి శుద్ధి కేంద్రాల వద్ద రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండగ నిర్వహించడం జరుగుతున్నదని ,ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మిషన్ భగీరథ మంచినీటిని ఇంటింటికి ఇవ్వడానికి పడుతున్న శ్రమను, ఖర్చును, పద్ధతులపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రత్యెకించి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది తిరుగుజలాల నుంచి శ్రీశైలం వద్ద ఏల్లూరు రిజర్వాయర్ ను నిర్మించి అక్కడి నుండి పైప్లైన్ ద్వారా తాగునీటిని తీసుకువచ్చి మన్నెంకొండ నీటి శుద్ధి కేంద్రం ద్వారా మహబూబ్నగర్ జిల్లాతో పాటు, నారాయణపేట జిల్లాకు తాగునీరు అందించడం జరుగుతున్నదని ,మన్నెంకొండ డబ్ల్యూటీపి వద్ద నాలుగైదు పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేసి అందించడం జరుగుతున్నదని వివరించారు.

మిషన్ భగీరథ తాగునీరు మినరల్ వాటర్ కన్నా గొప్పదని, ఎన్నో మినరల్స్ ఈ నీటిలో ఉన్నాయని ,కృత్రిమంగా దేవుడిచ్చిన వరప్రసాదంగా వచ్చిన ఈ నీరు ఎంతో శ్రేష్టమని, అందువల్ల ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ తాగునీటిని వాడాలని కోరారు. మిషన్ భగీరథ తాగునీటిని శుద్ధి చేసేందుకు ఎంతో మంది ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ఇప్పుడు ప్రతిరోజు వస్తున్నదని అలా అని నీటిని వృధా చేయవద్దని, సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా కొళాయిలు లేకుంటే తక్షణమే కొళాయిలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

Latest News

More Articles