తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్ష కోసం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) దరఖాస్తు గడువును పొడిగించారు అధికారులు. ఈ నెల(మే) 5వ తేదీతో ముగియనున్న గడువును 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఈసెట్ దరఖాస్తుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500.. ఇతర కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.900 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. లేట్ ఫీజు రూ.2,500 చెల్లించి ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 15న హాల్ టికెట్లు జారీ చేసి.. 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈసెట్ పరీక్ష జరగనుంది.