ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు నగరానికి రానున్నారు. దాంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అందులో భాగంగా సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. మోడీ ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా.. ప్రధాని మోడీ టూర్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కాబట్టి ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్గాల్లో కాకుండా.. తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- సంగీత్ ఎక్స్ రోడ్స్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ప్యారడైజ్, సీటీఓ, రసూల్పుర నుంచి బేగంపేటకు వెళ్లాలి.
- బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనదారులు సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్ రాయ్, బ్రూక్బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ మీదుగా వెళ్లాలి.
- బోయిన్పల్లి, తాడ్బన్ నుంచి టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్ బాండ్ వద్ద నుంచి సీటీఓ, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్బీఐ ప్యాట్నీ వైపు స్వీకార్ ఉపకార్ నుంచి వైఎంసీఏ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లాలి.
- ప్యాట్నీ నుంచి ఎస్బీఐ, స్వీకార్ ఉపకార్ వైపు వాహనాలను అనుమతించరు. క్లాక్ టవర్స్ వద్ద నుంచి వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
- తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్గూడ నుంచి ఫ్లాజా వైపు వెళ్లే వాహనాలను తివోలి వద్ద నుంచి స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
- జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి బేగంపేట వెళ్లే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్లాండ్, రాజ్భవన్ వైపు మళ్లిస్తారు.