ఐకార్ ఆధ్వర్యంలోని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులకు శిక్షణ ఇచ్చే విస్తరణ విద్యా సంస్థలో నూతన ఆడిటోరియం ప్రారంభించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఈ కార్యాలరామానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, వీసీ రఘునందన్ రావు, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, ఈఈఐ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయం, కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ ఆసక్తులు కారణంగా రైతు జీవితాలు మారుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కి కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తొమర్ సమర్ధించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ రంగ పెట్టుబడులలో పరిశోధన, విస్తరణ రంగాల మీద దృష్టిపెట్టాలి. ఐదు రాష్ట్రాలకు ఈ కేంద్రం సేవలు అందిస్తుంది .. దీనికోసం అందుబాటులో అన్నిరకాల సాంకేతికతను వాడుకోవాలి అని అన్నారు.
ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా పదివేలు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు పథకం తర్వాత కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించింది. రైతుభీమా పథకం ద్వారా రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నాం. సాగునీరుపై దృష్టిపెట్టి ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం’ అని అన్నారు నిరంజన్ రెడ్డి.