స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్య శిక్షణ వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. దీంతో సీఐడీ అధికారులు.. టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఈ కేసు అక్రమమని, అవినీతి జరుగలేదని తెలుపుతూ హైకోర్టు లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు ఇవాళ(శుక్రవారం) జస్టిస్ బేల ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాలు గడువు కావాలని, ఫిబ్రవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరుఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. అదే రోజు తనకు మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు విన్నవించారు. చివరకు కేసును ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తూ ధర్మాసనం అంగీకరించింది.
ఇది కూడా చదవండి: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ జడ్జిలకు ఆహ్వానం