చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 39 మంది మరణించగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. చైనాకు ఆగ్నేయంగా ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్లోని షిన్యూ నగరంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో బుధవారం మధ్యాహ్నం 3:24 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 120 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.