స్టేషన్ ఘన్పూర్ : తమను గెలిపిస్తే.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని ధ్వజమెత్తారు. స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరి, చిరుమర్తి లింగయ్య లకు మద్దతుగా ప్రసంగించారు.
‘‘ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? ఎన్కౌంటర్లు, నక్సలైట్ ఉద్యమాలే కదా..? ఇందిరమ్మ రాజ్యం ఏం చక్కదనం ఏడ్చింది. మందిని పట్టుకుపోయి జైళ్లో పడేసిండ్రు కదా..? మంచినీళ్లు, కరెంట్ లేకుండే కదా..? ఇవాళ ఎవ్వళ్లకు కావాలి ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంత సక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది. రూ. 2కే బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. మనం ఆలోచన చేయాలి.’’ అని కేసీఆర్ సూచించారు.