లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అయితే, జైల్లో ఆయనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దీంతో తనకు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా కోర్టును కేజ్రీవాల్ కోరారు. దీంతో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కేజ్రీ పిటిషన్పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనున్నట్లు తెలిపింది.
కాగా, మధుమేహంతో బాధ పడుతున్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఏప్రిల్ 14 నాటికి 276 ఎంజీ/డీఎల్గా నమోదైంది. దీంతో డాక్టర్ ని కలిసేందుకు అనుమతించాల్సిందిగా కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది. అయితే, ఈ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేసింది. ‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్కు అనుమతి ఉన్నది. దీంతో ఇష్టమైన ఆహారం తినేసి.. తద్వారా షుగర్ లెవెల్స్ పెంచుకొని, ఆరోగ్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు’ అని ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ న్యాయవాది తిప్పికొట్టారు. మీడియా ప్రచారం కోసం ఈడీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తోందన్నారు. దీంతో కేజ్రీవాల్ తీసుకోవాల్సిన డైట్ వివరాలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదిని, జైలులో ఇస్తున్న ఆహార వివరాలు అందించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: సంతానం లేని వారికి గరుడ ప్రసాదం.. 30 కి.మీ వరకు నిలిచిపోయిన వాహనాలు