గ్రామ పంచాయతీల సిబ్బంది సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. మా సమస్యలు పరిష్కరించండి … సమ్మె విరమిస్తాం. అంటూ మిర్యాల గూడ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు మంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు.
ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లితో కొద్దిసేపు మాట్లాడారు. వారి సమస్యలను మరోసారి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ, ముందుగా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని, ఆతర్వాత సమస్యల గురించి చర్చిద్దామని తెలిపారు. దీనికి వారు సమ్మతిస్తూ, సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు. అలా అయితే, ముందుగా సాధారణ డిమాండ్లను పరిశీలించి పరిష్కరిస్తామని, ఆర్థిక పరమైన అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి, చర్చిస్తామని మంత్రి తెలిపారు.