న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల వినియోగంపై భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ విమానాలను వాడుతున్న ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్జెట్తో మాట్లాడినట్లు డీజీసీఏ వెల్లడించింది. అదేవిధంగా అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్తో మాట్లాడుతున్నట్లు వెల్లడించింది.
ఇటీవల రెండు 737 మ్యాక్స్ విమానాల్లో కీలకమైన భాగంలో బోల్టులకు నట్లు సరిగా లేవని గుర్తించారు. విమానం పనితీరును నియంత్రించే కీలకమైన రడ్డర్ కంట్రోల్ వ్యవస్థలో ఈ లోపాన్ని ఓ విమానయాన సంస్థ గుర్తించడం సంచలనం సృష్టిస్తోంది. విమానాన్ని గాల్లో స్థిరంగా ఉంచేలా రడ్డర్ కంట్రోల్ వ్యవస్థ కీలకం. ఇందులోనే లోపాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. 737 మ్యాక్స్లో లోపాన్ని గుర్తించడంతో బోయింగ్ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ రకం 1,370 విమానాల్లో ఇలాంటి సమస్య ఏదైనా ఉందేమో ఆయా విమానయాన సంస్థలు సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది.