హైదరాబాద్: దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నామన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. రాబోయే 50 ఏండ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు. వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్ ట్రీట్మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించబోతున్నదని చెప్పారు.
ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే మూడేండ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి చేసేది ఇంకా ఉందని.. కానీ చేసింది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు.