తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సోలాపూర్ వెళ్తున్న విషయం తెలిసిందే. రేపు ఆయన పండరీపుర్లోని విఠలేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. అత్యంత పవిత్ర క్షేత్రమైన ఆ ప్రాంతంలో తెలంగాణ తన ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నది. అయితే ఆషాడ ఏకాదశి పండుగ వేళ భారీ సంఖ్యలో విఠలేశ్వరుడి దర్శనం కోసం భక్తులు రానున్నారు. ఆ భక్తులపై పూల వర్షం కురిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆలయానికి వచ్చే భక్తులపై సుమారు వెయ్యి కిలోల గులాబీ పువ్వుల రేకులను చల్లేందుకు ప్రణాళిక వేసినట్లు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మూడు హెలికాప్టర్ల ద్వారా పువ్వులు చల్లేందుకు ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే స్థానిక ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సుమన్ తెలిపారు. సోలాపూర్లో బీఆర్ఎస్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బాలస్క సుమన్ పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరాఠీలు కోరుకుంటున్నట్లు సుమన్ తెలిపారు. తెలంగాణ మోడల్ను మహారాష్ట్రలో అమలు చేస్తామని ఆయన అన్నారు. బీఆర్ఎస్కు మరాఠీల నుంచి భారీ మద్దతు దక్కుతుందన్నారు.