సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కార్మికుల పక్షపాతి అనీ, అందుకే దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించని విధంగా అత్యధిక బోనస్ ప్రకటించి కార్మికుల మన్ననలు పొందారని చెప్పారు. ఇవాళ (బుధవారం) సింగరేణి టీబీజీకేఎస్ సంఘం నేతలు కవితను ఆమె నివాసంలో కలిశారు. సింగరేణి కార్మికుల సమస్యలు, లాభాల బాట పట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆ తర్వాత మాట్లాడిన కవిత.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎప్పుడు మరచిపోరన్నారు. అవకాశం ఉన్న ప్రతిసారి కార్మికులకు ప్రయోజనం కల్పిస్తున్నారని గుర్తు చేశారు. 2014 లో కార్మికులకు 18 శాతం బోనస్ ఉండగా, 2022 నాటికి 30 శాతానికి పెంచామని, 2023 కి 32 శాతానికి పెంచినట్లు తెలిపారు.
సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని.. అందుకే సంస్థ తరపున సీఎంతో పాటు అందుకు సహకరించిన కవితకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు సింగరేణి టీబీజీకేఎస్ సంఘం నేతలు.