హైదరాబాద్: 2016లో ప్రధాని మోదీ ‘పెద్ద నోట్లరద్దు’ నిర్ణయం.. భారత చరిత్రలో ఓ అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. గత మార్చిలో కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్ట చేస్తుంది.
2014 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో రూ. 13 లక్షల కోట్ల నగదు ప్రజల దగ్గర ఉంది. 2022 మార్చి నాటికి ఈ మొత్తం రూ. 31.33 లక్షల కోట్లకు చేరింది. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ.. 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు.
పెద్ద నోట్లను రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. దీంతో మార్కెట్లో నోట్ల వాడకం తగ్గాలి.. కానీ నోట్ల రద్దు తర్వాత నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం.. 2016లో రూ. 16.41 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా.. 2022 డిసెంబర్ 23 నాటికి ఇది 32.42 లక్షల కోట్లకు పెరిగింది.
నకిలీ నోట్ల కట్టడికే పెద్దనోట్లను రద్దు చేసినట్లు చెప్పిన మోదీ మాటలు కూడా డొల్లేనని తేలింది. ఈ ఆరున్నరేండ్లలో కేవలం రూ. 250 కోట్ల నకిలీ నోట్లను మాత్రమే పట్టుకొన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా ఉండటానికే పెద్ద నోట్లను రద్దు చేపట్టామని కేంద్రం చెప్పినప్పటికీ.. వాస్తవ రూపంలో అదీ కూడా సాధ్యం కాలేదని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.