దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టు రికార్డు విజయాన్ని అందుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) – 2023లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్పై ఘనవిజయాన్ని అందుకుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు అన్మోల్ప్రీత్ సింగ్లు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ సునాయాసంగా విజయం సాధించింది.
Also Read.. పటాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 9మంది మృతి
రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోరు చేసింది. స్మాట్తో పాటు భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఇది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అభిషేక్ శర్మ 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 51 బంతులలో 9 బౌండరీలు 9 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేశాడు. ఇక మిడిలార్డర్లో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 26 బంతుల్లోనే ఆరు బౌండరీలు, తొమ్మిది భారీ సిక్సర్లతో 87 పరుగులు సాధించాడు.
Also Read.. ఆప్ నేత సిసోడియా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
భారీ ఛేదనలో ఆంధ్రా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసింది. ఆంధ్రా తరఫున రికీ భుయ్ సెంచరీ (52 బంతుల్లో 104, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటిగా ఆడినా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 105 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక స్కోర్లు చూస్తే.. 2019లో సిక్కీంపై ముంబై 258-4 పరుగుల భారీ స్కోరు చేసింది. 2019లోనే మణిపూర్పై ఆంధ్రా 252-4, సర్వీసెస్పై కర్నాటక 250-3 పరుగుల భారీ స్కోర్లు సాధించాయి. ఇక పురుషుల టీ20 క్రికెట్ (అంతర్జాతీయ స్థాయి)లో అత్యధిక స్కోర్ల జాబితా చూస్తే.. నేపాల్ (314-3, మంగోలియాపై), అఫ్గానిస్తాన్ (278-3, ఐర్లాండ్పై), చెక్ రిపబ్లిక్ (278-4, టర్కీపై)లు మాత్రమే పంజాబ్ కంటే ముందున్నాయి.