తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల గడువు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేస్తారు. స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. అయితే గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. నూతనంగా ఎన్నికైన శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్ను స్పీకర్గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్గా ఆయన నిలిచిపోతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే.
Read Also; టీ20ల్లో రికార్డ్ సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
కాగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి ప్రసాద్ గెలుపొందారు. 2009లో ప్రసాద్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా.. కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్ మరోసారి కేటాయించింది. ఈసారి 12 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.
తెలంగాణ శాసన సభ స్పీకర్ ఎన్నిక కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నేతలు హాజరవనున్నారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కేసీఆర్ను మంత్రి శ్రీధర్బాబు కోరిన నేపథ్యంలో.. నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.