తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్ కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,80,978 మంది పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా 71.07 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది.
ఫస్టియర్లో 60.01 శాతం, సెకండియర్లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లు అయిన https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.inలో ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.!