ఏ ఊరి చెరువు చూసినా నిండా నీళ్లు.. కొన్ని చోట్ల పొంగి పొర్లుతుంటే, మరికొన్ని చోట్ల మత్తళ్లు దుంకుతున్నాయి. ఒకటా, రెండా.. రాష్ట్రంలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైతన్న ఏ పంట వేసుకోవాలి? ఎంత పండించాలి? అన్నదానిపై ఆంక్షలు లేవు.
తెలంగాణలో క్రాప్ హాలిడేలకు కాలం చెల్లినట్టే. రాష్ట్రంలో మొత్తం జలవనరులు 46,500 ఉన్నాయి. వీటిలో జియోట్యాగ్ చేసిన చెరువులు 34,697 ఉన్నాయి. ఇక కరవు కాటకాలు తెలంగాణ దరిదాపులకు కూడా వచ్చే అవకాశమే లేదు. మూడుపంటలకు ఢోకా లేదిక. పుట్లకొద్ది ధాన్యపు రాసులతో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించటం ఖాయం ఇక. నిన్నమొన్నటి వరకు పడ్డ వర్షాలతో తెలంగాణ చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి.