హైదరాబాద్: బీజేపీలో క్రమశిక్షణ ఖతం, సమన్వయం శూన్యం అయిందని ఆరెస్సెస్, బీజేపీ వాదు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, అలకలు, అంతర్గత వివాదాలతో రాష్ట్రంలో బీజేపీ భ్రష్టుపట్టిందని విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా పార్టీ ప్రతిష్ఠను సగం గంగలో కలిపాడని, ఈటల రాజేందర్తో దానిని సంపూర్ణం చేశారని చెబుతున్నారు.
క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి ఉన్న గుర్తింపును బండి సంజయ్ పోగొట్టాడని, నోటికొచ్చినట్టు మాట్లాడటం.. తర్వాత నాలుక కరుచుకోవటం పార్టీని ప్రజల్లో చులకన చేశాయని అంటున్నా రు. బండిని చూసి మిగతా నేతలు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఒకటి రెండు ఉప ఎన్నికలతో వచ్చిన పేరును బండి తన ఘనతగా ప్రచారం చేసుకోవడంపై మండిపడుతున్నారు. నియంతృత్వ ధోరణి అవలంభించటం, తోటి నేతలను అవమానించటం, కోటరీని ఏర్పాటు చేసుకోవడం, తన అనునాయులకే పదువులు కట్టబెట్టడం వంటివి దశాబ్దాల బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఎరుగమని సీనియర్ బీజేపీవాదులు వాపోతున్నారు.
బంది, ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్రావు వంటి వారు వర్గాల పేరిట పార్టీ మొత్తాన్ని కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారు చేశారని బీజేపీవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య కనీస సమన్వయం లేదని వాపోతున్నారు.
ఈటల వచ్చీ రాగానే పెద్ద పదవి ఆశించటం, అది దక్కకపోవటంతో గ్రూపు రాజకీయాలను పతాక స్థాయికి చేర్చారని అంటున్నారు. బీజేపీ ఎన్నడూ లేని అలకల సంస్కృతిని తెరమీదికి తెచ్చారన్నారు. పార్టీని వీడుతారంటూ లీకులు ఇచ్చి కథనాలు ప్రసారం చేయించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.