దేవాలయంటే ఉత్తర భారతదేశంలోనే ఉన్నట్టు కేంద్ర పనితీరు ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు నార్త్ టెంపుల్స్ కి ఇచ్చిన ప్రాధాన్యం దక్షిణ భారతదేశంలోని దేవాలయాలకి ఇవ్వరు. దీనికి ఉదాహరణే.. అయోధ్య రామమందిరంకి ఇచ్చే ప్రాముఖ్యత యాదగిరిగుట్ట, తిరుమల దేవస్థానాలకి ఉండదు. ఇక గత ప్రభుత్వం తెలంగాణలోని ఆలయాలని పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. యాదగిరిగుట్టని అయితే గత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేశారు. అనంతరం వేములవాడ, భద్రాద్రి, కొండగట్టు వంటి ప్రముఖ ఆలయాల స్వరూపాలని మార్చేశాడు. కేంద్రం నుండి సహకారం లేకున్నా సొంత ఖర్చులతో తెలంగాణ ప్రభుత్వం ఈ అభివృద్ధిని చేపట్టింది. అయితే నిన్నటి కేంద్ర బడ్జెట్ లో కాస్త ఆశలు మళ్ళీ చిగురించేలా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ ఆలయాల అభివృద్ధిపై ప్రకటన ఇచ్చింది. పర్యాటకరంగం ప్రోత్సహకంలో భాగంగా.. తెలంగాణని టెంపుల్ టూరిస్ట్ హబ్ గా మారుస్తామని కేంద్రమంత్రి ప్రకటనతో ఆలయాల అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్రంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం, వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం, బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం, అలంపూర్లోని జోగులాంబ ఆలయం, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, వరంగల్లోని రామప్ప, భద్రకాళి ఆలయాలు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ ఆలయాల్లో మౌళిక సదుపాయాలు, యాత్రికుల కోసం కాటేజీలు, భోజనశాలలు, మరికొన్ని ప్రాథమిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాంతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు మహర్దశ రానున్నట్టు మంత్రి తెలిపింది. కేంద్రం చెప్పిన విధంగా పుణ్యక్షేత్రాలను అభివృద్ది చేస్తే.. పర్యాటకంగా అభివృద్ది సాధించటంతో పాటు ఆలయాలకు ఆదాయం పెరుగుతుందని ఎండోమెంట్ అధికారులు అంటున్నారు. చూద్దాం మరి కేంద్రం ఈ సారైనా తెలంగాణకి ఈ పుణ్యం చేస్తుందో లేదో.