ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది సివిల్ కోర్టు జడ్జి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్కు చెందిన జ్యోతిర్మయి ఇటీవలే వేములవాడకు బదిలీపై వచ్చారు. మంగళవారం వరకు ఆమె విధుల్లో ఉండగా, బుధవారం ఒకసారిగా పురిటినొప్పులు రావడంతో ఏరియా దవాఖానలో చేరారు. వైద్యురాలు చైతన్య సుధా ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చారు.
తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు తెలిపారు. దవాఖానలో మొదటి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి ఉయ్యాలను బహుమతి ఇస్తున్నామని, న్యాయమూర్తికి సైతం అందజేశామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు తెలిపారు.