ఎన్నికల కమిషన్ తెలంగాణలో భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ డిబేట్ కి హాజరైన క్రాంతి కిరణ్ అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులను మార్చినంత మాత్రాన ఎన్నికలు తారుమారు అయ్యే అవకాశం ఉండదన్నారు. మరో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
2014కి ముందు తెలంగాణ.. 2014 తర్వాత తెలంగాణ ఎలా ఉంది అన్న అంశం ట్రెండింగ్ లో ఉందన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా.. ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారన్నారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. తాను జర్నలిస్టుగా ఎంత నిజాయితీగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే నిజాయితీగా ఉన్నానన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు అన్నీ అవాస్తవమన్నారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.