కల్తీ నెయ్యి అమ్ముతున్న ఫ్యాక్టరీ గుట్టును రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. నగరంలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో కల్తీ నెయ్యి అమ్ముతున్నట్లు తేలింది. ఆ ఫ్యాక్టరీపై అటాక్ చేసిన పోలీసులు కొన్ని కంటేనర్లను సీజ్ చేశారు. పతంజలి, మదర్ డెయిర్, అముల్ లాంటి బ్రాండ్లకు చెందిన లేబుల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 19వ తేదీన ఆ ఫ్యాక్టరీపై విజిలెన్స్ పోలీసులు తనిఖీలు నిర్వమించారు. కల్తీ నెయ్యి చేసేందుకు అవసరమైన అన్ని వస్తువుల్ని గుర్తించినట్లు డీసీపీ హర్ష వర్ధన్ తెలిపారు. నెయ్యి ఫ్యాక్టరీ నడిపేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా వాళ్లు చూపించలేదని పోలీసులు చెప్పారు.
సుమిత్ అనే వ్యక్తి పేరు పై ఆ కంపెనీ ఉంది. కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం అతనిపై కేసు బుక్ చేశారు. వివిధ కంపెనీలకు చెందిన సుమారు అయిదు వేల లేబుల్స్ ను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మదర్ డెయిరీ పేరుతో ఉన్న 120 నెయ్యి కార్టన్లను సీజ్ చేశారు.