ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయన తమ సీఎం అభ్యర్థి అంటూ చింతా చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు. కాపులకు ఇదే సరైనా సమయమని ఆయన అన్నారు. చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని తెలిపారు. అక్కడి నుంచి పోటీ చేస్తే చిరంజీవి 50 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలని, ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని, ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చింతా మోహన్ అన్నారు. రాజకీయాల్లోకి రీఎంట్రీపై, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఏపీపై అధికారం చేజిక్కించుకోవడం సులభం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.
Read also: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది