దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మున్సిపల్ శాఖ ఆదర్శంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతిపై ఇవాళ(గురువారం) జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టణాల అభివృద్ధి కార్యాచరణపై మున్సిపల్ కమిషనర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. పౌరుడు కేంద్రంగా ఉండాలన్న ప్రభుత్వం ఆకాంక్షకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేసినా.. స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాదు..రాష్ట్రంలో అభివృద్ధి జరగకుంటే కేంద్రం ఊరికే గుర్తింపు ఇస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న అవార్డులే మన పనితీరుకు నిదర్శనమని తెలిపారు. 141 పురపాలక సంఘాల్లో 42 ‘ఓడీఎఫ్++’ గుర్తింపు సాధించాయి. మిగతా 99 పురపాలక సంఘాలూ ఇదే స్ఫూర్తితో కృషి చేయాలని సూచించారు. అధికారులు, యంత్రాంగం కొత్త ఆవిష్కరణలతో వస్తే స్వీకరిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న అధికారులను గుర్తించి, రివార్డులు ప్రకటిస్తామన్నారు.