పార్లమెంట్లో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్పు చెందింది. లోక్ సభలో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నామ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్ 23న పార్టీ పేరు మార్చాలని పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు చేసిన అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన చెప్పారు. తాజా ఆదేశాల మేరకు లోక్ సభలో పార్టీ ప్లోర్ లీడర్గా నామ కొనసాగుతారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను బీఆర్ఎస్ వెల్లడించింది. బలమైన ప్రతి పక్ష పాత్రను లోక్ సభలో బీఆర్ఎస్ పోషిస్తుందని నామా పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, లోక్ సభలో బీఆర్ఎస్ క్రియాశీలకంగా వ్యవరిస్తుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల వాణీని గట్టిగా వినిపిస్తామని నామ నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటులో 9 మంది సభ్యులతో బీఆర్ఎస్ లోక్ సభా పక్షం ఉంది. కాగా.. ఇప్పటికే రాజ్యసభలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.