భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ఇచ్చిన నర్సింగ్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుంది. నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 15 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్ట్ నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వమే. అది మీదని చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మణుగూరులో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుందని బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పలేకపోయాం. కాంగ్రెస్ జూటా మాటలను, అబద్ధ ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూసి ప్రజలు నమ్మారు. కనీసం పాలనలోనైనా నిజాన్ని చూపించండి. చరిత్ర హీనులుగా మిగలకండి. ప్రజలను మోసం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మనవి చేస్తున్న’’ అని హరీష్ రావు అన్నారు.