రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పదవి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ ఆ పదవిని రేవంత్ కించపరిచేలా వ్యవహరిస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
Read Also: కళ్లల్లో కారం చల్లిన వదిన.. గొడ్డలితో నరికిన అన్న
‘జ్వరం వచ్చినా మెదక్ మీటింగ్ కదా అని ఓపిక చేసుకుని వచ్చాను. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల మనమే గెలిచాం. స్వల్పఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయిందని తెలిపారు. ఏది జరిగినా మన మంచికే. ఏవి పాలో, ఏవి నీళ్లో ప్రజలకు అర్థమైంది. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసింది. కర్నాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే సరిస్థితి లేదని అక్కడి ప్రజలు చెప్పారు.
ఆరు నెలల దాటితే ఇక్కడ స్థానిక ఎన్నికలు వస్తాయని, అప్పుడు ప్రజలు మనల్ని వెతుక్కుని ఓటు వేస్తారు. ఉచిత కరెంట్ రావడం లేదు. మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంట్ మోటార్లను రిపేర్ చేసే వ్యాపారం పెరిగింది. జనరేటర్ల వ్యాపారం పెరిగింది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే. కాంగ్రెస్ ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసమర్థత కనిపిస్తున్నాయి. పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో దాడులు చేస్తున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. మేం కేసులు పెట్టివుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారు.
రైతుబంధు రూ. 15 వేలకు పెంచలేదు కదా.. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. పింఛన్ రూ. 4 వేలు పెరగలేదు. వడ్లకు బోనస్ పెరగలేదు. అక్కాచెల్లెళ్లకు రూ. 2500 రాలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదు. పింఛన్ పెంచడానికి ఏ ప్రక్రియ కూడా అవసరం లేకపోయినా ఎందుకు పెంచడం లేదు? వంద రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కర్రు కాల్చి వాతపెడతారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
Read also: రాజకీయాలకు వీడ్కోలు పలికిన ఎంపీ గల్లా జయదేవ్
మేం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్ళు కడిగాం అని హరీశ్రావు గుర్తు చేశారు. ఇంటింటికి మంచినీళ్లు, 11 లక్షలమంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, రైతు బంధు హామీలను ఎన్నికల్లో ఇవ్వకపోయినా అమలు చేశాం. కరోనా కష్ట సమయంలో సైతం ప్రభుత్వం దగ్గర పైసల్లేకపోయినా బిల్లులు, ఎమ్మెల్యల జీతాలు ఆపి రైతుంబంధు ఇచ్చాం. ఇప్పుడు ఏ సమస్యా లేకపోయినా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదు? రేవంత్ పాలనను కేసీఆర్ పాలనతో పోల్చి చర్చలు పెట్టండి. కాంగ్రెస్ దళితబంధు పక్కన పెట్టింది. గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వడం లేదు. రూ. 2 లక్షల సాయం కూడా అందలేదు. కేసీఆర్ ప్రారంభించిన పనులను అడ్డుకుంటున్నారు. వచ్చిన నిధులను వెనక్కి పంపుతున్నారు. ఇదేనా అభివృద్ధి?
పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మెదక్లో భారీగా ఓట్లు వేయిద్దాం. పద్మమ్మ ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మనం చేసిన మంచి పనులను ప్రచారం చేసుకోలేకపోయాం. కాంగ్రెస్ హామీలపై చర్చ పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేసేదాక ప్రభుత్వం మెడలు వంచుతాం. అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడుతాం. కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అండగా ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది. మెదక్లో గులాబీ జెండా ఎగరేస్తాం’ అని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు.